కేసీఆర్‌కు ఊహించని షాక్.. బీఆర్ఎస్‌తో ‘దోస్తీ’ తెంచుకునేందుకు సిద్ధమైన MIM..!

by Satheesh |
కేసీఆర్‌కు ఊహించని షాక్.. బీఆర్ఎస్‌తో ‘దోస్తీ’ తెంచుకునేందుకు సిద్ధమైన MIM..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా మజ్లిస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్‌తో దోస్తీ కటీఫ్‌కు సిద్ధమవుతుంది. ఒంటరిగానే బరిలోకి దిగి సత్తా చూపాలని నిర్ణయించుకుంది. కార్యాచరణ కూడా స్టార్ట్ చేసింది. ముస్లింల ఓట్లు చీలకుండా పక్కా ప్లాన్ రూపొందించుకుంది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో సభలను నిర్వహించనుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన అసెంబ్లీ, లోక్ సభ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దోస్తీ కట్టాయి.

ఇక ముందు సొంతంగా సత్తా చాటి ఏ ప్రభుత్వం ఏర్పడినా కీరోల్ పోషించాలని మజ్లిస్ టార్గెట్‌గా పెట్టుకుంది. రాష్ట్రంలో 119 స్థానాలు ఉండగా.. ఇందులో సుమారు 50 చోట్ల మజ్లిస్‌కు 20వేలకు పైగా ఓట్లతో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది. ప్రస్తుతం 7 మంది ఎమ్మెల్యేల బలాన్ని 15పైగా పెంచుకునేందుకు పక్కా ప్లాన్ వేసింది. రాష్ట్రంలో సుమారు 40 స్థానాల్లో పోటీలోకి దిగనుంది. ఇందులోభాగంగా మొదటిసారి కేసీఆర్‌పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ విమర్శలకు దిగారు.

స్టీరింగ్ తమ చేతుల్లో లేదంటూ..

మే నెల చివరలో ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముస్లింల సంక్షేమాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గచ్చిబౌలిలో స్థలం ఇచ్చినా ఇస్లామిక్ సెంటర్‌ను నిర్మించడం లేదని, షాదీ ముబారక్ చెక్కులు ఏడాది అయినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ‘‘మేము చెప్పిన పనులు ఎందుకు జరగడం లేదు. బీఆర్ఎస్ స్టీరింగ్ మా చేతుల్లో లేదు’’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.

గతేడాది ఫిబ్రవరి 4న అసెంబ్లీలోనూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అప్పటి నుంచే రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో మజ్లిస్ రాష్ట్రంలో ముస్లింలు బలంగా ఉన్న స్థానాల వివరాలను సైతం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే బీఆర్ఎస్‌పై అసదుద్దీన్ స్వరం పెంచినట్టు తెలిసింది.

పోటీ చేస్తే కష్టమే..

ముస్లింల వ్యతిరేక ఓట్లు చీలకుండా ఎన్నికలకు ముందస్తుగానే మజ్లిస్ ఫోకస్ పెట్టింది. మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లితే.. అది బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందనే భావించి మజ్లిస్ ఒంటరిగా పోటీకి సిద్ధమవుతుందా? ప్రజల్లో బీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీ భావనతో పార్టీకి నష్టమని భావించిన పార్టీ అధినేత రెండూ వేర్వేరు అని చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని మలక్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, బహదూర్ పురా, యాకత్ పురా, కార్వాన్ స్థానాల్లో మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ స్థానాల్లోనూ మజ్లిస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పటివరకు దోస్తీ కట్టిన బీఆర్ఎస్, మజ్లిస్ వచ్చే ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తే పాలిటిక్స్ రసవత్తరంగా మారనున్నాయి. మరోవైపు మజ్లిస్ త్వరలోనే నిర్వహించే సభల్లో బీజేపీ, కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేయనున్నట్లు సమాచారం. ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు మళ్లీ ఎప్పుడు ఏ పార్టీ కూడా మజ్లిస్ జోలికి రాకుండా వార్నింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఏదీ ఏమైనా మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే.. ఏ పార్టీకి లబ్ధిచేకూర్చనుందోననే ఆసక్తి నెలకొంది.

Also Read: ‘చేతి’కి చిక్కిన ‘వైఎస్సార్‌టీపీ’.. ఇక షర్మిలకు మిగిలింది ఆ ఒక్క ఆప్షనేనా!

Advertisement

Next Story

Most Viewed